Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో ‘ఆపరేషన్ ట్రాష్-ఐ’ పేరుతో భారత భద్రతా బలగాలు వేట మొదలుపెట్టాయి.
దీనిలో భాగంగా ఇక్కడి చాత్రూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల కోసం జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐబీ దళాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. మంచుతో నిండిన ఈ అటవీ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. పర్వత ప్రాంతంలోని ఒక మట్టి ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదుల్ని ఉదయం 11 గంటల సమయంలో గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు.. మన బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో మన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కొంతసేపటి తర్వాత కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల స్థావరం నుంచి రెండు ఏకే-47 తుపాకులు, అలాగే కొంత యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక.. చాత్రూ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. గత నెలలో ఆరుకుపైగా ఎన్కౌంటర్లు జరిగాయి. లష్కరే తొయిబా దేశంలో దాడులకు కుట్ర పన్నిందన్న సమాచారం నేపథ్యంలో భారత భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.