Love Story | వారిద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో దోషులు. ఒకే జైల్లో ఉంటున్నారు.. ఇక రోజు ఏవేవో మాటలతో మమేకమవుతూ ఒకరిపై మరొకరు మనసు పారేసుకున్నారు. ఇద్దరి మనసులు కలవడంతో మనువాడాలనుకున్నారు. జైలు గోడల మధ్య విరబూసిన వారి ప్రేమకథ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పారు. ఇంకేముంది.. ఆ విరబూసిన ప్రేమకు గుర్తుగా ఆ జంటకు పెళ్లి చేయాలనుకున్నారు. ఐదు రోజుల పెరోల్పై విడుదలైన ఆ దోషులకు.. ఇరు కుటుంబాలు ఘనంగా వివాహం జరిపించారు.
వివరాల్లోకి వెళ్తే.. అసోంకు చెందిన అబ్దుల్ హసీం, పశ్చిమ బెంగాల్కు చెందిన షాహానర ఖతున్ వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలారు. హసీంకు 8 ఏండ్లు, షాహానరకు 6 ఏండ్ల జైలు శిక్ష విధించారు. వీరిద్దరిని బెంగాల్లోని బర్దమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్కు తరలించారు.
వీరిద్దరికి అంతకు ముందు పరిచయం లేదు. కానీ ఒకరినొకరు ఇష్టపడ్డారు. జైలు గోడల మధ్యనే వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు.. తమ లవ్ స్టోరీ గురించి ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. దీంతో హసీం, షాహానర పెరోల్పై విడుదలయ్యారు. ఐదు రోజుల పెరోల్ లభించడంతో.. బుధవారం నాడు హసీం, షాహానరకు ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఇక పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఆ దంపతులు మళ్లీ జైలుకు వెళ్లనున్నారు.