Uttarakhand | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రూ. 14.74 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెలల క్రితం ప్రారంభించగా, నిన్న కురిసిన కుండపోత వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశ చెందారు. సోలనీ నదిపై ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో.. దీని ద్వారా స్థానికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించేవారు. నాసిరకంగా పనులు చేపట్టడంతోనే బ్రిడ్జి వరదపాలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023, ఏప్రిల్ 19వ తేదీన బ్రిడ్జిని ప్రారంభించినట్లు స్థానిక వ్యక్తి మీడియాకు తెలిపాడు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొండ చరియలు విరిగి పడుతుండడంతో అక్కడున్న ఇండ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉప్పొంగుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇండ్లలో ఉన్న వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలను కోరారు. పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.