శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పండ్ల తోటలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారు. భద్రతా దళాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మార్గాలు మూసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. (terrorists cornered) షోపియాన్ జిల్లా మీమందర్ ప్రాంతంలోని పండ్ల తోటలో లష్కర్-ఎ-తైబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్లు శుక్రవారం రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా భద్రతా దళాలు పసిగట్టాయి. దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన జాకిర్, లతీఫ్గా వారిని గుర్తించారు. 2024 నుంచి నిషేధిత ఎల్ఈటీతో జాకిర్కు సంబంధం ఉండగా, లతీఫ్ గత ఏడాది ఆ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్నారు.
కాగా, ఆ ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మార్గాలను ఆర్మీ మూసివేసింది. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం వారిని సమీపిస్తున్న సైనిక బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
మరోవైపు ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వారి కోసం ఇంకా గాలిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆదివారం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనగుతున్నట్లు చెప్పారు. అదనపు బలగాలను రప్పించామని, ఆ ఉగ్రవాదులు తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేసినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. నాలుగు గ్రామాలను క్లియర్ చేయడంతో పాటు, మిగిలిన ప్రాంతం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి.