భోపాల్: మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాను వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకున్నారు. సర్జరీ ద్వారా చెవి, ఛాతిలో మైక్రో బ్లూటూత్ పరికరాలను అమర్చుకున్నారు. పరీక్షలో చీటింగ్కు పాల్పడ్డారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ నిశితంగా పరిశీలించడంతో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. ఎంబీబీఎస్ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సోమవారం తుది పరీక్షలు నిర్వహించారు. ఎంజీఎం మెడికల్ కాలేజీ, అరబిందో మెడికల్ కాలేజీ, ఇండస్ మెడికల్ కాలేజీలకు చెందిన 80 మంది వైద్య విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
అయితే ఎంజీఎం మెడికల్ కాలేజీలో పరీక్ష రాస్తున్న విద్యార్థులను దేవి అహల్య విశ్వవిద్యాలయ (డీఏవీవీ) ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. టెక్నాలజీతో చీటింగ్కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. ఒక విద్యార్థి తన చొక్కాలో మొబైల్ ఫోన్గా ఉపయోగించే సిమ్తో కూడిన చిన్న పరికరాన్ని దాచిపెట్టాడని ఒక అధికారి తెలిపారు. పరీక్ష సమయంలో సాధారణ మొబైల్తో ఫోన్ కాల్స్ చేస్తున్న మరో విద్యార్థిని కూడా గుర్తించినట్లు చెప్పారు.
ఈ ఇద్దరు వైద్య విద్యార్థులు పరీక్షలో కాపీకి పాల్పడటం కోసం బ్లూటూత్తో పని చేసే మైక్రోఫోన్ పరికరాలను సర్జరీ ద్వారా చెవి, ఛాతిలో అమర్చుకున్నారని వివరించారు. పరీక్షలో చీటింగ్కు పాల్పడిన ఇద్దరు వైద్య విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్లు డీఏవీవీ వైస్ ఛాన్సలర్ రేణు జైన్ తెలిపారు. ఈ విద్యార్థులపై చర్యలకు డీఏవీవీ కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఎంజీఎం మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షత్ చెప్పారు. వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.