న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఒకేసారి కుప్పకూలాయి. సాధారణ శిక్షణలో భాగంగా గ్వాలియర్ ఎయిర్పోర్టు నుంచి శనివారం ఉదయం టేకాఫ్ అయిన సుఖోయ్ 30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్లు కొంతసేపటికే కూలిపోయాయి. ఈ ఘటనలో మిరాజ్లో ఉన్న పైలట్ హనుమంత్ రావు సారథి మృతి చెందగా, సుఖోయ్లో ఉన్న ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ పైలట్లను మిలిటరీ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నివేదించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత వాయుసేన పేర్కొంది.
రెండు విమానాలు ఢీకొట్టడం వల్లే ప్రమాదం ?
గాల్లో రెండు యుద్ధ విమానాలు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే, భారత వాయుసేన మాత్రం ప్రమాదం ఎలా జరిగిందని అధికారికంగా ప్రకటన చేయలేదు.
రాజస్థాన్లో విమాన శకలాలు ?
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోనూ ఓ విమానం కూలిందనే ప్రచారం జరుగుతున్నది. ఉచ్చెయిన్ ప్రాంతంలో శనివారం విమాన శకలాలు పడ్డట్టు భరత్పూర్ ఎస్పీ తెలిపారు. అయితే, మధ్యప్రదేశ్లో జరిగిన రెండు యుద్ధ విమానాలు కూలిన సంఘటనలోనే కొన్ని శకలాలు భరత్పూర్లో పడ్డాయని మొరెనా కలెక్టర్ అంకిత్ ఆస్థానా తెలిపారు. రెండు ప్రాంతాల రాష్ర్టాలు వేరైనా, సమీపంలోనే ఉంటాయన్నారు.