కోల్కతా: ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని, ఇద్దరు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులోని కక్మారిచర్ బీఎస్ఎఫ్ క్యాంప్లో 177 బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లు సోమవారం ఉదయం 6.45 గంటలకు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎస్ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ జాన్సన్ టోప్పోగా మృతులను గుర్తించారు.
గత ఏడాది సరిహద్దులో ఒక రైతును నిర్బంధించిన ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లు శేఖర్, జాన్సన్పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలంటూ వీరిద్దరికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఉదయం దీనిపై వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహావేశాలకులోనై తమ వద్ద ఉన్న సర్వీస్ తుపాకులతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్ఎస్ గులేరియా చెప్పారు.