అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మాదకద్రవ్యాల కట్టడిలో విఫలమైన రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ పోర్టులైన ముంద్రా, పిపవావ్ పోర్టులు దేశంలో డ్రగ్స్కు గేట్వేలుగా మారాయని ఆరోపించాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎందుకు ఈ రెండు పోర్టుల యజమానులను ప్రశ్నించడం లేదని నిలదీశాయి. సింథటిక్ డ్రగ్స్ను తయారుచేస్తున్న నాలుగు ఫ్యాక్టరీలను గత మూడు నెలల్లోనే గుర్తించారని, హోం మంత్రి కనుసన్నల్లోనే ఇవి కొనసాగుతున్నాయని ఆరోపించాయి. గుజరాత్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుండటంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించాయి.
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతుండటంపై ప్రధాని మోదీ ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ప్రశ్నించారు. ‘గుజరాత్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ డ్రగ్స్ బిజినెస్? ప్రధాని సమాధానం చెప్పాలి. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ గుజరాత్కు చేరుతున్నది. గాంధీ-పటేల్ పుణ్యభూమిలో ఈ విషాన్ని వ్యాప్తి చేస్తున్నదెవరు?’ అని ఆయన ప్రశ్నించారు.