Gurcharan Das | న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది తామేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే, ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని ప్రముఖ రచయిత, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మాజీ సీఈవో గురుచరణ్దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుస్తకం ‘ద డైలెమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్’ లాంచింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థికశాఖమంత్రి మన్మోహన్సింగ్ తప్ప కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు.
“మనం నెమ్మదినెమ్మదిగా సంస్కరణల వైపు అడుగేశాం. కారణం నరసింహారావు, మన్మోహన్సింగే. వారిచుట్టూ ఉన్నవారు సొంతపార్టీని కూడా ఒప్పించలేకపోయారు. కాబట్టి సంస్కరణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. నిజం చెప్పాలంటే రావు (నరసింహారావు)తో పార్టీ ఎంతో అసంతృప్తికి గురైంది’ అని జన్నలిస్టు షోమా చౌదరితో మాట్లాడుతూ చెప్పారు. భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ.. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం బలహీన పడడం ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకింగ్ టైగర్ బుక్స్ ప్రచురించిన ‘ద డైలమా ఆఫ్ యాన్ ఇండియన్ లిబరల్’ ప్రస్తుతం ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.