న్యూఢిల్లీ, నవంబర్ 11: తరచూ మోదీ ప్రభుత్వాన్ని కీర్తించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి మరో అడుగు ముందుకేశారు. మోదీని పొగిడేందుకు ఏకంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సమరయోధులు, ప్రజల త్యాగాలు, బలిదానాలను అవమానించేలా మాట్లాడారు. దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ 2014లో మోదీ అధికారంలోకి వచ్చాకే లభించిందని, 1947లో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష అని ఆమె అన్నారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సహా పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జాతీయోద్యమాన్ని అవమానించిన కంగన దేశ ద్రోహానికి పాల్పడ్డారని, ఆమెకు ఇటీవల ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కంగన వ్యాఖ్యలు ఉన్న 24 సెకండ్ల వీడియో క్లిప్ను వరుణ్ గాంధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. కొందరు ప్రేక్షకులు చప్పట్లు కొడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. కంగన వ్యాఖ్యలను దేశ వ్యతిరేకమైనవిగా ప్రకటించాలని, లేకపోతే దేశ స్వాతంత్య్రం కోసం రక్తం చిందించినవారికి వెన్నుపోటు పొడిచినట్టేనని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ‘ఒకసారి మహాత్మాగాంధీ త్యాగాన్ని అవమానిస్తారు. మరోసారి గాంధీజీ హంతకుడిని గౌరవిస్తారు. ఈ ఆలోచనా తీరును ఉన్మాదం అనాలా? లేక దేశ ద్రోహం అనాలా?’ అని బీజేపీ వైఖరిని ప్రశ్నించారు.
కంగనపై చర్యలు తీసుకోవాలి
కంగన ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్కు గురికావడంతో విమర్శలపై ఆమె ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. ‘1857 సైనిక తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర సంగ్రామంగా నేను ప్రస్తావించాను. దాన్ని అణచివేసిన తర్వాత బ్రిటిషర్లు మరిన్ని దురాగతాలకు పాల్పడ్డారు. దాదాపు శతాబ్దం తర్వాత గాంధీ భిక్షాపాత్రలో మనకి స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు వెళ్లి ఇంకా ఏడ్వండ’ని వ్యాఖ్యానించారు. ఆమె కాంగ్రెస్ మీదా విమర్శలు సంధించారు. ‘మనకి భిక్షగా వచ్చింది కూడా స్వాతంత్య్రమేనా? కాంగ్రెస్ పేరిట బ్రిటిష్ వదిలి వెళ్లింది ఏమిటి?.. వాళ్లు బ్రిటిష్కు కొనసాగింపు’ అని కంగన విమర్శించారు. దేశద్రోహం కింద కంగనపై చర్యలు తీసుకోవాలని ఆప్ నాయకురాలు ప్రీతీ మెనన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.