Dropouts | న్యూఢిల్లీ : ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19 వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. స్వయంగా కేంద్రమే తాజాగా గణాంకాలను విడుదల చేసింది. వారంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే కావటం ఆందోళన కలిగిస్తున్నది. అదే సమయంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అక్కడ ఎదురవుతున్న కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్ తదితర కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయినా, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏ చర్యలూ తీసుకోవటం లేదు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవటం లేదు. దీంతో సెంట్రల్ వర్సిటీల్లో 2018-2023 మధ్య 6,901 మంది ఓబీసీ, 3,596 మంది ఎస్సీ, 3,939 మంది ఎస్టీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. ఐఐటీల్లో 2,544 మంది ఓబీసీ, 1,362 మంది ఎస్సీ, 538 మంది ఎస్టీ విద్యార్థులు కాలేజీ క్యాంపస్లను వీడారు. 133 మంది ఓబీసీ, 143 మంది ఎస్సీ, 90 మంది ఎస్టీ విద్యార్థులు ఐఐఎంల నుంచి వెళ్లిపోయారు.
ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ విద్యార్థి ఒకరు మార్చి 31న ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బాంబే క్యాంపస్లో నెలకొన్న కుల వివక్షకు దళిత విద్యార్థి దర్శన్ సోలంకి బలయ్యాడు. ఫిబ్రవరి 12న సూసైడ్ చేసుకున్నాడు. ఐఐటీల్లో కుల వివక్ష, అంటరానితనం అనేది లేదని కేంద్రం బుకాయిస్తున్నా, వాస్తవం కాదని విద్యార్థులే చెప్తున్నారు. ‘క్యాంపస్లో కుల వివక్ష ఉన్నది. సాయం చేయండని కోరితే ఒక్కరూ ముందుకు రాలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇదే సమస్యతో 2014లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో, మేమంతా స్టూడెంట్ సపోర్ట్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం. కాలేజీ యాజమాన్యానికి కొన్ని సలహాలు, సూచనలు చేశాం. ఇవేవీ అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ సెల్ను సంప్రదించే విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే క్యాంపస్లో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని కొంతమంది విద్యార్థులు భయపడుతున్నారు’ అని ఐఐటీలో చదువుతున్న పీహెచ్డీ విద్యార్థి మహేశ్ తెలిపారు.