అహ్మదాబాద్: ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న 18 మంది పాకిస్థానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించింది. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. ఈమేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 1,167 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొంది. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని అందులో వెల్లడించింది.
నూతన భారత్ కల సాకారానికి అందరితో కలిసి పనిచేయాలని తాజాగా పౌరసత్వం పొందిన వారికి మంత్రి పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి పథంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నామన్నారు. భారత పౌరసత్వం పొందిన వారందరినీ ప్రధాన స్రవంతిలో భాగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బాధిత మైనారిటీలకు సులువుగా, వేగంగా ఇక్కడి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని చెప్పారు.