ముంబై: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో (Thane hospital) గత 24 గంటల్లో 18 మంది రోగులు మరణించారు. మృతుల్లో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు.
కాగా, చనిపోయిన రోగుల్లో థానే నగరానికి చెందిన వారు ఆరుగురు, కళ్యాణ్కు చెందిన వారు నలుగురు, సహపూర్కు చెందిన వారు ముగ్గురు, భివాండి, ఉల్హాస్నగర్, గోవండి (ముంబై) నుంచి ఒక్కరు చొప్పన ఉన్నారని, ఒకరి ప్రదేశం గురించి తెలియదని నగర కమిషనర్ అభిజిత్ బంగర్ తెలిపారు. చనిపోయిన రోగుల్లో 12 మంది వయసు 50 ఏండ్లకు పైగా ఉంటుందని చెప్పారు. మరణించిన రోగులంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించేందుకు వైద్యాధికారులను అక్కడికి పంపినట్లు వెల్లడించారు.
మరోవైపు, 24 గంటల్లో 18 మంది రోగులు చనిపోవడంపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించినట్లు అభిజిత్ తెలిపారు. హెల్త్ సర్వీసెస్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ, ఈ మరణాలకు సంబంధించిన క్లినికల్ అంశాలపై దర్యాప్తు చేస్తుందని చెప్పారు. చికిత్సా విధానంలో లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై కొందరు రోగుల బంధువులు ఆరోపించారని అన్నారు. ఈ నేపథ్యంలో మరణించిన రోగుల బంధువుల నుంచి దీనిపై ఆరా తీసి వారి స్టేట్మెంట్లను రికార్డు చేస్తామని వెల్లడించారు. కాగా, పలువరు డాక్టర్లు, సిబ్బంది డెంగీ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి వంటివి ఎక్కువ సంఖ్యలో రోగుల మరణాలకు కారణాలు కావచ్చని తెలుస్తున్నది.