మైసూరు, గువాహటి, మే 29: కర్ణాటక, అస్సాంలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి చెందారు. కర్ణాటకలో సోమవారం కొల్లెగల-టి నరసిపుర జాతీయ రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో కారు-ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్టు పోలీసులు తెలిపారు. బళ్లారికి చెందిన ఒక కుటుంబం ఇన్నోవా కారులో మైసూరుకు బయలుదేరారు. వీరి కారును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు పిల్లలు సహా 10 మంది మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యిందని, క్షతగాత్రులను వివిధ దవాఖానలకు పంపి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అస్సాంలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో డివైడర్ను ఢీకొని అవతలి లైన్లో వస్తున్న వ్యాన్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గువాహటిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న పది మంది విద్యార్థులు ఆదివారం రాత్రి స్కార్పియోలో వస్తుండగా, జలుక్బరి వద్ద వీరి వాహనం డివైడర్ను ఢీకొంది. అనంతరం దానిని దాటుకుని వెళ్లి అవతలి లేన్లోంచి వస్తున్న ఒక ట్రక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, గాయపడిన వారి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు.