శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ(Rajouri ) జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రబలుతున్నది. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఆ రహస్య వ్యాధి వల్ల సుమారు 17 మంది మరణించారు. బదాల్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం స్టడీ చేస్తున్నది. అయితే ఆ అజ్ఞాత శత్రువు ఆనవాళ్లను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది.
డిసెంబర్ ఏడవ తేదీ నుంచి బదాల్ గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదు మంది పరిస్థితి విషమంగా ఉన్నది. బాధితులు న్యూరో సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆ పేషెంట్లలో కేంద్ర నాడీ వ్యవస్థతో పాటు మెదడు కూడా డ్యామేజ్ అవుతున్నట్లు పసికట్టారు.
మృతులతో కాంటాక్టులోకి వచ్చిన సుమారు 300 మందిని క్వారెంటైన్ చేశారు. రాజౌరీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వాళ్లను క్వారెంటైన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం జరుగుతున్నట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు రాజౌరీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియా తెలిపారు.
ప్రభావిత ప్రాంతాన్ని మాస్క్ లేకుండా విజిట్ చేశానని, తనకు ఎటువంటి అనారోగ్యం కలగలేదని డాక్టర్ భాటియా స్పష్టం చేశారు. వైరల్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, జూనాటిక్ సంక్రమణలు జరగడంలేదన్నారు. స్థానికులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మృతుల శరీరాల్లో కాడ్మియం ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
లక్నోలోని టాక్సికాలజీ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన పరీక్షల్లో.. మృతుల శరీరాల్లో కాడ్మియం ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే వారి శరీరాల్లోకి కాడ్మియం మూలకం ఎలా ఎంటరైందన్న కోణంలో విచారణ సాగుతోందన్నారు. కాడ్మియం చాలా విషపూరితమైన ఖనిజం. ఒకవేళ దాన్ని కడుపులోకి తీసుకున్నా.. లేక పీల్చినా.. దాని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కలుషిత గాలి, ఆహారం, నీటి వల్ల కాడ్మియం శరీరంలోకి వచ్చే ఛాన్సు ఉన్నది.