న్యూఢిల్లీ, జూన్ 20: ఆన్లైన్లో అతిపెద్ద డాటా చౌర్యం జరిగింది. దీని వల్ల ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్వర్డ్లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్గా నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని, ఇది విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, గుర్తింపు చోరీ (ఐటెంటిటీ థెఫ్ట్), ఆన్లైన్ ఖాతాల హ్యాకింగ్కు దారితీయవచ్చని సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది చాలా కాలం నుంచి ఉన్న పాత డాటా డంప్ కాదని, లీక్ అయిన సమాచార వివరాల్లో కొత్తవి, చక్కగా ఆర్గనైజ్ చేసినవి, ‘ఇన్ఫోస్టీలర్లు’ అని పిలిచే ఒక రకమైన మాల్వేర్ ద్వారా సేకరించినవి ఉన్నాయని సెక్యూరిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు ప్రజల డివైజ్ల నుంచి నిశబ్దంగా యూజర్నేమ్లు, పాస్వర్డ్లను తస్కరించి హ్యాకర్లకు పంపుతాయి. ఆ వివరాలను హ్యాకర్లు నేరుగా ఉపయోగిస్తారు. లేదంటే డార్క్ వెబ్ వేదికల్లో అమ్మకానికి పెడతారు.
లీకైన డాటాలో ఏమున్నది?
లీక్ అయిన డాటాలో ఈ-మెయిల్ ఖాతాలు, గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలతోపాటు కొన్ని ప్రభుత్వ పోర్టళ్ల సేవల కోసం వినియోగదారులు ఉపయోగించే లాగిన్ వివరాలు ఉన్నట్టు తెలుస్తున్నది. సైబర్ నేరగాళ్లు సులభంగా ఉపయోగించుకోగలిగేలా ఇందులో చాలా సమాచారం వెబ్సైట్ లింక్తోపాటు యూజర్ నేమ్, పాస్వర్డ్ను చూపించే ఫార్మాట్లో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఎంతో నిర్మాణాత్మకంగా, వినియోగాత్మకంగా ఉన్న ఈ డాటాను చూసి సైబర్ సెక్యూరిటీ నిపుణులే నివ్వెరపోతున్నారు. ఇది కేవలం డాటా ఉల్లంఘన మాత్రమే కాదని, ‘ప్రపంచ సైబర్ నేరానికి బ్లూప్రిట్’ అని పేర్కొంటున్నారు. రక్షణ లేని ఓ వెబ్ సర్వర్లో 18.4 కోట్ల రికార్డులతో కూడిన ఓ రహస్య డాటా బేస్ ఉన్నట్టు ఇటీవల పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ భారీ లీకేజీ బయటపడింది. ఇందులో దాదాపు 30 భారీ డాటా సెట్లు ఉన్నాయని, ఒక్కో సెట్లో కోట్ల లాగిన్ వివరాలను సేకరించారని, మొత్తంగా 1,600 కోట్లకుపైగా పాస్వర్డ్లు చోరీకి గురయ్యాయని నిపుణులు భావిస్తున్నారు.
ఎందుకు తీవ్రమైనది?
తస్కరణకు గురైన డాటా ఎవరైనా సులభంగా కొనుగోలు చేయగలిగేలా అందుబాటులో ఉండటం ముప్పు తీవ్రతను మరింత పెంచుతున్నది. సాంకేతిక విజ్ఞానం అంతగా లేనివారితోపాటు చాలా తక్కువ డబ్బు ఉన్నవారు సైతం డార్క్ వెబ్లో ఈ పాస్వర్డ్లను యాక్సెస్ చేయగలరని, దీంతో రోజువారీ వినియోగదారులు మొదలుకొని కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ తీవ్రముప్పు పొంచి ఉన్నదని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సంప్రదాయ పాస్వర్డ్ల నుంచి పాస్కీస్ లాంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ సూచించింది.
ఇప్పుడు ఏం చేయాలి?
డాటా లీకేజీ వల్ల ఏర్పడిన ముప్పు నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ వెంటనే చర్యలకు ఉపక్రమించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రధాన ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లను మార్చుకోవాలని, బలమైన, ప్రత్యేమైన పాస్వర్డ్లను ఉపయోగించాలని, అన్ని వివరాలను భద్రంగా ఉంచుకునేందుకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్కి మారడంతోపాటు పాస్వర్డ్ మేనేజర్ యాప్స్ను వినియోగించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఏదైనా సమాచారం లీక్ అయిందేమో తనిఖీ చేసుకునేందుకు డార్క్ వెబ్ మానిటరింగ్ టూల్స్ను ఉపయోగించాలని, తస్కరణకు గురైన డాటాలో ఎవరివైనా ఈమెయిళ్లు లేదా పాస్వర్డ్లు ఉంటే ఈ టూల్స్ వెంటనే అప్రమత్తం చేస్తాయని తెలిపారు.