పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉదయం 2 గంటల నుంచి ఆరు గంటల మధ్య 15 మంది కరోనా రోగులు మరణించారు. వీరు కూడా ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం తీరుపై బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం మండిపడింది. ఈ మరణాలు కూడా ఆక్సిజన్ కొరత వల్లనే జరిగి ఉంటాయని అభిప్రాయపడింది. ఆక్సిజన్ సరఫరాను ప్రభుత్వం మెరుగు పరచలేదన్న విషయం అర్థమవుతున్నదని విమర్శించింది. అన్నింటిని పక్కన పెట్టి కనీసం ఒక రాత్రి అయినా ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగులు చనిపోకుండా చూడాలని న్యాయమూర్తులు ఎంఎస్ సోనాక్, నితిన్ జాంబ్రేతో కూడిన ధర్మాసనం సీఎం ప్రమోద్ సావంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.