ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మోదీకి కుటుంబం లేదని ప్రతిక్షాలు విమర్శిస్తున్నాయని, మోదీ జైలుకు వెళ్లలేదని, రాజకీయాలు రావని అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలారా నా జీవితం తెరిచిన పుస్తకం అని మోదీ అన్నారు.
ఓ లక్ష్యంతో చిన్నతనంలోనే ఇంటిని వదిలి వెళ్లానని, దేశ ప్రజల కోసం జీవించాలన్న స్వప్నంతో ఇళ్లు విడిచి వెళ్లినట్లు ప్రధాని తెలిపారు. తన జీవితంలో ప్రతి క్షణం కేవలం ప్రజలకే కేటాయించినట్లు చెప్పారు. మీ స్వప్నాలే నా సంకల్పం అవుతుందని ఆయన ప్రజలను ఉద్దేశంచి అన్నారు. మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చనున్నట్లు చెప్పారు.
అందుకే దేశ ప్రజలు తనను స్వంత మనిషిలా చూస్తారని, కుటుంబ వ్యక్తిలా ప్రేమను పంచుతారని, అందుకే 140 కోట్ల మంది దేశ ప్రజలే నా కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని మోదీ అన్నారు. దేశమే కుటుంబం అన్న సంకల్పంతో ప్రజల కోసం జీవిస్తున్నానని మోదీ తెలిపారు.
దేశం ఇప్పుడు ఒకే స్వరంతో .. మై హూ పరివార్ అని అంటోందన్నారు. నేనే మోదీ కుటుంబం అని అంటోందని ఆయన పేర్కొన్నారు. మై హూ మోదీ పరివార్ అని సభకు వచ్చిన ప్రజలతో మోదీ పలికించారు. తెలంగాణ ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నానని, గర్వంతో నిండిన ప్రజలకు చెబుతున్నానని, రామ మందిరంలో బంగారు దర్వాజాలు, ఆ మందిరంలోని స్తంభాల్లో తెలంగాణ పాత్ర ఉందన్నారు. యావత్ తెలంగాణ ప్రజల పట్ల దేశం ధన్యవాదాలు వ్యక్తం చేస్తోందన్నారు. రామ్లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. సమృద్ధి దేశాల సరసన ఇండియాను నిలపనున్నట్లు చెప్పారు.
మన తల్లితండ్రులు కష్టాల్లో బ్రతికారని, కానీ మన పిల్లలు అలాంటి పరిస్థితిలో ఉండకుండా చూద్దామన్నారు. తెలంగాణ ప్రజలారా మీ ఆశీర్వాదం కావాలని, అపారమైన ప్రేమ కావాలన్నారు. ఇండియా కూటమి నేతలు అవినీతి, ఆశ్రితపక్షపాతంలో కూరుకుపోయారని, వాళ్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిందని, వాళ్ల కుటుంబ పాలన గురించి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత.. వాళ్లు మోదీకి ఫ్యామిలీ లేదని అంటోందని ఇండియా కూటమిని ఆయన తప్పుపట్టారు.