వడోదర, జనవరి 18: విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. గుజరాత్లో పడవ బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. 20 మందిని రక్షించారు. వడోదర పాణిగేట్లోని న్యూ సన్రైజ్ స్కూల్కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్రలో భాగంగా నగర శివారులోని హరిణి లేక్ వద్దకు గురువారం సాయంత్రం వెళ్లారు.
సరస్సులో బోట్ షికారు చేస్తుండగా అది బోల్తా పడింది. బోటులో కేవలం 10 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించినట్టు మంత్రి సంఘవి తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఇది తెలియజేస్తున్నదని చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విద్యార్థులు ప్రయాణించిన పడవ సామర్థ్యం 16 మంది కాగా, పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
అంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మాట్లాడుతూ.. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అత్యున్నత విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం..
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద స్థలానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.