జైపూర్: ఓ బాలికపై తొమ్మిది రోజులపాటు సామూహిక అత్యాచారం చేసిన 13 మందికి రాజస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విదించింది. మరో ఇద్దరిని నాలుగేండ్లపాటు ఖైదు చేసింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఈ ఏడాది మార్చి 6న కోటా జిల్లాలోని సుకేత్ పోలీస్ స్టేషన్లో 15 ఏండ్ల బాలిక అత్యాచారం కేసు నమోదయింది. పూజా జైన్ అనే మహిళ.. ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి, ఫిబ్రవరి 25న ఝలావర్లో విక్రయించింది. అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝలావర్లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజులపాటు వారు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో మొత్తంగా 16 మందికి కోర్టు శిక్ష విధించింది. మరో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన నలుగురు మైనర్లు ఇప్పటికే స్థానిక జువెనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా విచారణ ఎదుర్కొంటున్నారు. బాలికను విక్రయించిన మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 20 ఏండ్లు జైలుశిక్ష పడిన ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. నాలుగేళ్లు శిక్ష పడిన వారు రూ.7 వేలు కట్టాలని ఆదేశించింది.