పనాజి: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో శుక్రవారం మరో 13 మంది కరోనా రోగులు మరణించారు. గురువారం 15 మంది, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది రోగులు చనిపోయారు. దీంతో ఈ ఆసుపత్రిలో వరుసగా నాలుగు రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన కరోనా రోగుల సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఈ పిటిషన్లపై గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నది. కాగా, శుక్రవారం కూడా ఆక్సిజన్ కొరత వల్ల ఈ ఆసుపత్రిలో 13 మంది కరోనా రోగులు మరణించినట్లు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వరుస మరణాలపై స్పందించిన ధర్మాసనం గోవా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరతను నివారించే చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తగినంత ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూడాలని సూచించింది. ఆక్సిజన్ కొరత వల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.