12 మంది భక్తుల మృతి
జమ్ముకశ్మీర్లో ఘోరం
చిన్న వాగ్వాదమే కారణం!
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
జమ్ము, జనవరి 1: జమ్ముకశ్మీర్లో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం అర్ధరాత్రి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గర్భగుడి సమీపంలోని మూడో నంబర్ గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది యువకుల మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల వ్యవధిలోనే తొక్కిసలాటకు దారి తీసినట్టు ప్రాథమికంగా తెలిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. పోలీసులు, అధికారులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే 12 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో ఏడుగురు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ముగ్గురు ఢిల్లీవాసులు. మిగతా ఇద్దరు హర్యానా, జమ్ముకశ్మీర్కు చెందినవారు. కాగా, ఆలయ నిర్వహణ సరిగ్గా లేనందువల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. ఆరోపణలను ఆలయ బోర్డు ఖండించింది.
12 లక్షల ఎక్స్గ్రేషియా
ఆలయంలో తొక్కిసలాటపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదంపై మోదీకి వివరించినట్టు ఆయన చెప్పారు. ‘మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. గాయపడ్డవారి చికిత్స ఖర్చులను ఆలయ బోర్డే భరిస్తుంది’ అని పేర్కొన్నారు. మృతదేహాలను కాట్రా బేస్ క్యాంప్లోని దవాఖానకు తరలించారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. యూపీ రాష్ర్టానికి చెందిన మృతులకు ఆ రాష్ట్ర సర్కారు రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.