న్యూఢిల్లీ, జూలై 10: ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జైలు నుంచే అతడు అక్రమ దందా నడిపేందుకు గత రెండేండ్లలో 81 మంది అధికారులకు ఏకంగా రూ.12.5 కోట్ల మేర ముట్టజెప్పాడని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం గుర్తించింది. వారందరిపై ఢిల్లీ పోలీసు విభాగం కేసులు నమోదు చేసింది. ఈ నెలలో కూడా బయట ఉన్న సుఖేశ్ అనుచరులతో మాట్లాడేందుకు డ్యూటీ నర్సింగ్ సిబ్బందిని వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తనకు ప్రాణహాని ఉందని, జైలు అధికారులు తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ తన భార్యతో కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.