భోపాల్: అది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ప్యూన్, డ్రైవర్లు, వాచ్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంకేముంది.. అసలే ప్రభుత్వ ఉద్యోగం, హోదా ఏదైతే ఏం అనుకున్నారో ఏమో.. దరఖాస్తులతో యువత భారీ సంఖ్యలో బారులు తీరారు. అందులో పది పాసైనవారి నుంచి డిగ్రీలు పీజీలు, ఇంజినీరింగ్, ఎంబీఏ చేసినవారు, సివిల్ జడ్జి ఉద్యోగార్థులు కూడా ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే పోస్టుల సంఖ్య ఎంతనుకుంటున్నారు.. 15. అవును అక్షరాలా పదిహేను. వీటికోసం 11 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం మధ్యప్రదేశ్ మాత్రమే కాదు పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి యువత తరలిరావడం విశేషం.
‘నేను లా పూర్తిచేశాను. డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాను. జడ్జి ఉద్యోగానికికూడా సిద్ధమవుతున్నాను. పుస్తకాలు కొనుక్కోవడానికి పైసలు లేవు. దీంతో పనికోసం ఈ పోస్టుకు అప్లయ్ చేశాను’ అని జితేంద్ర మౌర్య అనే యువకుడు చెప్పాడు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 99 వేల మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే వారిలో 90 శాతానికిపైగా డిగ్రీ చేసినవారే ఉండటం గమనార్హం.
ఎంప్లాయ్మెంట్ శాఖ గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్లో 32,57,136 మంది నిరుద్యోగులు ఉన్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖలో 30,600 పోస్టులు, హోం శాఖలో 9388, ఆరోగ్య శాఖలో 8592, రెవెన్యూ శాఖలో 9530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.