న్యూఢిల్లీ, ఆగస్టు 13: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటున్నదని తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సాధనా సంపత్తిని దుర్వినియోగం చేయడంపై టీఆర్ఎస్ సహా 11 విపక్ష పార్టీలు యుద్ధ భేరి మోగించాయి. ఢిల్లీలో శనివారం విపక్షాల సమావేశం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీతో పాటు వెల్ఫేర్ పార్టీ, స్వరాజ్పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి సమాధి కట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని నేతలు విమర్శించారు. సమావేశంలో త్రీఎం (మెషీన్, మనీ, మీడియా)లను కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తున్నదో చర్చించి, వీటిపై పోరాడాలని పేర్కొంటూ మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఓటింగ్ విధానంలో మార్పులు..
మొదటి తీర్మానం.. ఓటింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలని, ఓటర్లు తాము వేసిన వ్యక్తికే ఓటు పడిందో లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని, వీవీప్యాట్ రశీదులను ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ రశీదులను వేరే చిప్ ఫ్రీ బాక్స్లో వేసేలా చూడాలని సూచించింది. దీంతో అనుకున్న వ్యక్తికే వారి ఓటు పడినట్టు నిర్ధారించుకోవడమే కాకుండా లెక్కలోకి వచ్చినట్టు ధ్రువీకరించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశాయి.
పెరిగిన డబ్బు ప్రమేయం
రెండో తీర్మానం.. ఎన్నికల వాతావరణం దెబ్బతీసేలా పెద్ద ఎత్తున డబ్బు పంచిపెడుతూ ఓటర్లను మభ్యపెడుతుండటాన్ని విపక్ష పార్టీలు ఆక్షేపించాయి. అభ్యర్థుల ఖర్చుపై ఆంక్షలు ఉన్నప్పటికీ పార్టీలు పెట్టే ఖర్చుపై ఎలాంటి నియంత్రణ లేదని, దీంతో విచ్చలవిడిగా డబ్బు వినియోగం జరుగుతున్నదని దుయ్యబట్టాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎన్నికల్లో డబ్బు ప్రమేయం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాయి.
మూడో తీర్మానం.. తప్పుడు సమాచారం, విద్వేష ప్రసారాలతో ప్రజలపై తప్పుడు అభిప్రాయాలను రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం మీడియాను ఉపయోగించుకుంటున్నదని, ఫేక్న్యూస్ను అరికట్టడంతో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమవుతున్నదని విపక్షాలు విమర్శించాయి. ఈ విషయంలో నేరస్తులు ఏ స్థాయిలో ఉన్నా ఈసీ కఠినంగా వ్యవహరించాలని కోరుతూ తీర్మానం చేశాయి. ఈ సమావేశంలో సురేశ్రెడ్డి (టీఆర్ఎస్), దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా(సీపీఐ), మైరాజుద్దీన్ అహ్మద్ (ఆరెల్డీ), జితేంద్ర అవధ్ (ఎన్సీపీ), డానీష్ అలీ (బీఎస్పీ), ఘన శ్యాం తివారీ (ఎస్పీ), యోగేంద్ర యాదవ్ (స్వరాజ్పార్టీ), ఇలియాస్ (వెల్ఫేర్ పార్టీ)తో పాటు పౌర హక్కుల కార్యకర్త అరుణా రాయ్ పాల్గొన్నారు.