Delhi Accident | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాద ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు 11 మంది పోలీసులపై చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించిన రూట్లలో గస్తీ తిరుగుతున్న మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ల సిబ్బందితోపాటు రెండు పోలీస్ పికెట్స్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. డీసీపీ స్థాయి అధికారి సహా 10 మందిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వాళ్లపై శాఖాపరమైన విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. హోంశాఖ ఆదేశాల మేరకు 11 మందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులపై హత్యా నేరం మోపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది.
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.