న్యూఢిల్లీ: దేశంలో 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు టీకాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు కోటిమందికి పైగా టీనేజర్లు తొలి డోస్ టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. దేశంలో 15-18 ఏండ్ల మధ్య వయసువారు 7.40 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతోపాటు దేశంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తున్నదని పేర్కొన్నది.
మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. గడిచిన 8 రోజుల్లో దేశంలో కరోనా 6.3 రెట్లు పెరిగిందని, డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03 శాతానికి చేరిందని పేర్కొన్నది.
ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా 25.2 లక్షల మంది కరోనా బారినపడ్డారని, మహమ్మారి ఉద్భవించినప్పటి నుంచి దేశంలో ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో కేసులు ఎప్పుడూ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిలో 65 శాతం కేసులు యూకే, యూఎస్ఏ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లోనే నమోదయ్యాయని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 108 ఒమిక్రాన్ మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలియజేసింది.