లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా సాగింది. హపూర్ జిల్లాలోని సప్నావత్ గ్రామంలో 106 ఏండ్ల వయసు కలిగిన మన్నా దేవి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఓటింగ్ ప్రక్రియకు విద్యాధికులే దూరంగా ఉంటుంటే వయసు మీదపడినా మున్నా దేవి ఓపికగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటు వేశారు. ఐటీబీపీ జవాన్ల సాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మున్నా దేవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో సాయంత్రం ఐదు గంటల వరకూ 57.79 శాతం పోలింగ్ నమోదైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం షమ్లి, ముజఫర్నగర్, భాగ్పట్, మీరట్, ఘజియాబాద్, హపూర్, గౌతం బుద్ధనగర్, బులంద్షహర్, అలీఘఢ్, మధురా, ఆగ్రా జిల్లాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో కాంగ్రెస్ ఉనికిపాట్లు పడుతుండగా..దళితులు, అణగారిన వర్గాల ఆసరాతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది.