ముంబై: మహారాష్ట్రలో రోజువారీ కరోనా మరణాలు మూడు నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 103 మంది కరోనాతో చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా 25,425 కేసులు నమోదు కాగా శుక్రవారం 24,948 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,66,586కు, మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,55,554కు చేరింది. పాజిటివ్ రేటు 10.32గా ఉన్నది. మొత్తం మరణాల సంఖ్య 1.42 లక్షలు దాటింది.
మరోవైపు ముంబైలో కూడా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గురువారం 1,384 కేసులు నమోదు కాగా, శక్రవారం 1,312 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ముంబైలో యాక్టివ్ కరోనా కేసులు 14 వేలకుపైగా ఉన్నాయి. కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 110 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,040కి చేరింది.