న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో విజేతలుగా నిలిచిన 8000 మంది అభ్యర్ధుల్లో వేయికి పైగా మగువలు ఉన్నారు. తొలి ఎన్డీఏ ఎగ్జామ్ను 1002 మంది మహిళలు క్లియర్ చేశారు. నవంబర్ 14న యూపీఎస్సీ నిర్వహించన పరీక్షల్లో 1002 మంది మహిళా అభ్యర్ధులు విజేతలై ఎస్ఎస్బీ ఎదుట హాజరవడంతో పాటు వైద్య పరీక్షలను ఎదుర్కొంటారు.
ఆపై వీరిలో 19 మంది మంది షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్ధులు వచ్చే ఏడాది నిర్వహించే ఎన్డీఏ కోర్సుకు ఎంపికవుతారు. వీరంతా ఆర్మీ, నేవీ, భారత వాయుసేనల్లో ఆఫీసర్లుగా అడుగుపెడతారు. ఎన్డీఏ వచ్చే ఏడాది 400 మంది కేడేట్స్ను అడ్మిట్ చేసుకోనుండగా వీరిలో ఆర్మీ పది మంది మహిళలతో సహా 208 మంది అభ్యర్ధులను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక నేవీలో ముగ్గురు మహిళలు సహా 47 మందిని రిక్రూట్ చేసుకుంటుంది. ఐఏఎఫ్ 120 మంది అభ్యర్ధులను నియమించుకోనుండగా ఇందులో ఆరుగురు మహిళా అభ్యర్ధులుంటారు.
ఎన్డీఏ పరీక్షకు మొత్తం 5,75,856 దరఖాస్తులు రాగా 1,77,654 దరఖాస్తులు మహిళల నుంచి వచ్చాయని రాజ్యసభలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. ఎన్డీఏ క్యాంపస్లో మహవిళా కేడెట్ల ఎంట్రీ సందర్భంగా వీరికోసం ఎన్డీఏ మహిళా ఇన్స్ట్రక్టర్లు, వైద్యులు, ఇతర సహాయ సిబ్బందిని నియమించుకోవడంతో పాటు మహిళలకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకుంటోంది. కేంద్రం కోరిన విధంగా వచ్చే ఏడాది నుంచి కాకుండా ఈ ఏడాది నుంచే ఎన్డీఏలో మహిళల చేరిక ఉండాలని ఈ ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.