న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ (Manipur) నుంచి మహారాష్ట్ర (Maharashtra) వరకు పాదయాత్ర చేయనున్నారు. ఆదివారం మణిపూర్లోని ధౌబల్ జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో 180 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యాత్రను అక్కడి నుంచే దీనిని ప్రారంభించనుండటం గమనార్హం. ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 377 అసెంబ్లీ స్థానాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. మొత్తంగా 67 రోజుల్లో 6700 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 11 రోజులపాటు 20 జిల్లాల్లో 1074 కిలోమీటర్ల మేర ఈయాత్ర సాగనుంది. జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల చొప్పున, మధ్యప్రదేశ్లో 7 రోజులపాటు నడువనున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో మణిపూర్ బయల్దేరుతారు. ప్రారంభ కార్యక్రమంలో ఏఐసీసీ నేతలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీపీసీసీ చీఫ్ రుద్రరాజు, రఘువీరారెడ్డి, పల్లం రాజు పాల్గొంటారు.