ముంబై: దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి నివారణకు ముమ్మరంగా చర్యలు తీసుకున్నది. దీనికోసం విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహించింది. దీంతో మహానగరంలో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరు పూర్తిస్థాయిలో కరోనా టీకా తీసుకున్నారని బీఎంసీ ప్రకటించింది. వయోజనుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది.
మంగళవారం నాటికి 92,42,888 సెకండ్ డోసులు పంపిణీ చేశామని తెలిపింది. అయితే 92,36,500 వ్యాక్సిన్ డోసులు పంపిణీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే దానికంటే అధికంగానే వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. కాగా, ఇప్పటివకు 1,02,96,917 మంది వయోజనులకు మొదటి డోసును ఇచ్చామని, ఇది 111 శాతామని చెప్పింది. అదేవిధంగా 12 ఏండ్లు పైబడినవారిలో 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశామన్నది.
మొత్తంగా 1,02,44,843 మందికి రెండో డోసు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 94,92,511 మందికి సెకండ్ డోసు ఇచ్చామని బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది.