జైపూర్: రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. బర్మేర్లోని పచ్పద్ర ఏరియాలో లారీ, ప్రయాణికులతో వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఆ వెంటనే బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 10 మంది మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసుల ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.