రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. దీంతో రెండు రోజులుగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మరణించినట్లయింది.
సోమవారం సాయంత్రం గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో గరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ సిబ్బంది సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డుతోపాటు మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఈ నెల 16న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. అదే రోజు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో చనిపోయింది 12 మంది కాదని, మొత్తం 18 మంది మృతిచెందారని మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. పోలీసులు గుర్తించిన 12 మం ది మృతుల్లో సింహభాగం హిడ్మా పీఎల్జీఏ ఒకటో బెటాలియన్కు చెందినవారే ఉన్నారు.