Chhattisgarh : ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పవర్ ప్లాంట్లోని బాయిలర్ పేలిన ఘటనలో 10 మంది మరణించగా, 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్, శక్తి జిల్లా, సింగితారి గ్రామ సమీపంలోని వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పవర్ ప్లాంట్లోని బాయిలర్ ఉన్నట్లుండి పేలిపోయింది.
ఘటన జరిగినప్పుడు చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల పని చేస్తున్నారు. ఈ పేలుడు భారీగా ఉండటంతో అక్కడ పని చేస్తున్న కార్మికుల్లో 10 మంది మరణించారు. మరో 30 నుంచి 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి తలెత్తింది. పేలుడు జరగడంతో అక్కడి కార్మికులు పారిపోయేందుకు ప్రయత్నించగా, ఇంకొందరు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.