Lok Sabha Elections | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలు.. జల్పాయిగురి(ఎస్సీ), కూచ్ బెహార్(ఎస్సీ), అలిపూర్దౌర్(ఎస్టీ)కు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఈ మూడు నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
తొలి దశ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. కోటీశ్వరుల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఆర్ఎస్పీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
జల్పాయిగురి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి దేవ్రాజ్ బర్మన్ ఆస్తులు రూ. 3,89,89,468. దేవ్రాజ్ అత్యంత ధనికుడు అని ఏడీఆర్ వెల్లడించింది. అలిపూర్దౌర్ నుంచి పోటీ చేస్తున్న చందన్ ఓరాన్ ఆస్తులు కేవలం రూ. 12,117 మాత్రమే. ఇక 37 మందిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 16 మంది 8 నుంచి 12వ తరగతి వరకు చదువగా, మరో 20 మంది గ్రాడ్యుయేట్లు. ఒకరు నిరక్ష్యరాస్యుడు.