న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే పది బిల్లులు ఆమోదం పొందాయి. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు కూడా ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ఈ పది బిల్లులపై పార్లమెంట్ ఉభయ సభల్లో సుమారు 48 గంటల పాటు చర్చ జరిగింది. లోక్సభలో రెండు నిమిషాల చర్చ, రాజ్యసభలో 8 నిమిషాల చర్చ తర్వాత వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందింది. సహాయక పునరుత్పత్తి సాంకేతిక నియంత్రణ బిల్లుపై లోక్సభలో గరిష్ఠంగా మూడు గంటల 51 నిమిషాల చర్చ జరిగింది. ఈ చర్చలో 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యసభలో ఒక గంటా 17 నిమిషాలు చర్చ జరుగ్గా 14 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం నిరవధిక వాయిదా పడ్డాయి.