శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ (Kunzer) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు సెర్చ్ ఆపరేషన్ బృందాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాయడని జిల్లా ఎస్పీ అమోద్ అశోక్ (SSP Amod Ashok) తెలిపారు. అతడిని లష్కరే తొయీబాకు (LeT ) చెందిన ఉగ్రవాదిగా గుర్తించామన్నారు. కశ్మీర్లో జీ20 సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. కాగా, బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమార్చిన విషయం తెలిసిందే.
రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్కౌంర్ చోటుచేసుకోవడం విశేషం. శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు సైనికులపై పేలుడు పదార్థం విసిరారని ఆర్మీ పేర్కొన్నది. ఇటీవల జమ్ము రీజియన్లో ఆర్మీ ట్రక్పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది.
#WATCH | Baramulla encounter: Information was received about some suspicious movement. A cordon and search operation was launched and during that firing was done towards us and in retaliatory firing one terrorist of LeT has been killed. Our forces are alert in view of G20 Summit… pic.twitter.com/1i1ld637EG
— ANI (@ANI) May 6, 2023
ఈ క్రమంలో రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. కాగా, గాలింపు కొనసాగుతున్నదని, అదనపు బలగాలను కూడా రప్పించినట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. టెర్రరిస్టు గ్రూపులో కొంత మంది హతమై ఉంటారని భావిస్తున్నామని ఆర్మీ పేర్కొన్నది.