భువనేశ్వర్: ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత వంద మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది. (Students Hospitalised) ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వంద మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.
కాగా, అనారోగ్యం చెందిన విద్యార్థులను తొలుత స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వారిలో 67 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో బరిపడలోని పీఎంఆర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. ఐదో తరగతి విద్యార్థిని రూపాలి బెస్రాను సోమవారం ఐసీయూలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆ బాలిక మరణించింది. మిగతా 66 మంది విద్యార్థులు అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో 41 మంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు.
అయితే ఈ సంఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు రాస్గోవింద్పూర్-జలేశ్వర్ రహదారిని మంగళవారం దిగ్బంధించారు. మరణించిన విద్యార్థిని కుటుంబానికి పరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయంత్ కుమార్ పాణిగ్రాహిని సస్పెండ్ చేశారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Also Read:
Students Kidnapped Classmate | విలాసవంత జీవితం కోసం.. క్లాస్మేట్ను కిడ్నాప్ చేసిన విద్యార్థులు
Woman Elopes With Lover | ప్రియుడితో పారిపోయిన మహిళ.. విషమిచ్చి చంపిన అత్తింటి కుటుంబం