శ్రీనగర్: భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ఒక పోలీస్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఒక పోలీస్, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అదనపు బలగాలను సంఘటనా స్థలానికి రప్పించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.