ముంబై: మహారాష్ట్రలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తమ ప్రభుత్వం సర్వే నిర్వహించిందని, సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 0.19 శాతం మందికి, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 0.25 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సర్వేలో తేలిందని ఆయన చెప్పారు.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో తాము ఆరోగ్య నిపుణులను ఆరా తీశామని, అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామంది కొవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని వారు చెప్పారని అజిత్ పవార్ తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు సడలించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేదంటే వైరస్ విస్తృతి ఇలాగే కొనసాగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.