ముంబై, మార్చి 28: కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సంకేతాలిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రజలు మరో లాక్డౌన్కు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధిస్తే మంచిదని అధికారులు ఉద్ధవ్కు సూచించగా.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తే ప్రజలకు నిత్యావసరాలు, మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దవాఖానాల్లో సౌకర్యాలపై ఆరాతీశారు. దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్న సంగతి తెలిసిందే.
ఒక్కరోజులోనే 312 మంది
దేశంలో ఒక్కరోజులోనే (శనివారం నుంచి ఆదివారం నాటికి 24 గంటల వ్యవధిలో) 312 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్కరోజులో ఇంతమంది ప్రాణాలుకోల్పోవడం ఈ ఏడాదిలోనే తొలిసారి. ఇదే సమయంలో 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 62,714 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు వెలుగుచూడటం కూడా ఈ ఏడాదిలోనే తొలిసారి. తనకు కరోనా సోకిందని కేంద్రమంత్రి రతన్లాల్ కటారియా ఆదివారం చెప్పారు.
బడికి వెళ్లడం వల్లే పిల్లలకు వైరస్
ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు బెంగళూరులో 472 మంది చిన్నపిల్లలకు వైరస్ సోకింది. వీరంతా 10 ఏండ్లలోపు వయసున్నవారు. ముఖ్యంగా పిల్లలు పాఠశాలలకు వెళ్లడం, ఇంటి బయట ఆడుకోవడంతో వైరస్ సోకుతున్నట్లు లైఫ్కోర్స్ ఎపిడిమాలజీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ప్రొఫెసర్ గిరిధార చెప్పారు. విద్యార్థులను పాఠశాలల్లో దూరం దూరంగా కూర్చోబెట్టినా వాళ్లు ఎక్కువసేపు అలా కూర్చోరని, ఏదో సమయంలో గుమిగూడుతారని, ఇది కూడా వైరస్ వ్యాప్తికి ఓ కారణమని తెలిపారు. అంతేగాక పిల్లలు ఎక్కువ సేపు మాస్క్లను ధరించరని గుర్తుచేశారు.
ఇవీ కూడా చదవండి..
ఆ చట్టాల్లేకుంటే 2022లో రైతుల ఆదాయం రెట్టింపు డౌటే !
‘పాలపుంత’లో నివసించొచ్చు.. ప్రదేశం కనుగొన్న శాస్త్రవేత్తలు