జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై గత ఏడాది సచిన్ పైలట్ సహా ఆయనకు మద్దతు ఇచ్చే పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ పైలట్ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది.
రాజస్ధాన్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాషాయ పార్టీతో తాను పోరాడిన క్రమంలో బీజేపీలో తాను చేరుతాననే ప్రచారం అసంబద్ధమని అప్పట్లో పైలట్ తోసిపుచ్చారు. ఈ నెలలో రాజస్ధాన్లో మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల నియామకాలు చేపడతారనే వార్తల నేపథ్యంలో పైలట్ బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. పైలట్ శిబిరంలో పదవుల పంపకంపై డిమాండ్లు ఊపందుకోవడంతో ఈ నెలలో జరిగే విస్తరణలో ఆయన వర్గీయులకు కీలక పదవులు ఇవ్వడంతో పాటు, రాజకీయ నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు.