న్యూఢిల్లీ : నేరస్తులకు బీజేపీ మద్దతు పలుకడం మహిళల పట్ల ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ తరహా రాజకీయాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిగ్గుపడటం లేదా అని రాహుల్ నిలదీశారు. బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం పట్ల బీజేపీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు.
ఉన్నావ్, హత్రాస్, కథువా లైంగిక దాడి ఘటనలు, తాజాగా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను ప్రస్తావిస్తూ మహిళల పట్ల బీజేపీ వైఖరిని రాహుల్ ఎండగట్టారు. ఉన్నావ్లో బీజేపీ ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించారని, కథువాలో రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ చేపట్టారని రాహుల్ గుర్తుచేశారు.
ఇక హత్రాస్లో రేపిస్టులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించిందని తాజాగా గుజరాత్లో రేపిస్టులను విడుదల చేసి గౌరవించారని మండిపడ్డారు. నేరస్తులకు వత్తాసు పలుకుతూ బీజేపీ మహిళల పట్ల తన చవకబారు వైఖరిని ప్రదర్శించిందని దుయ్యబట్టారు. ఇక బిల్కిస్ బానో కేసులో రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ సహా విపక్షాలు బీజేపీ సర్కార్ తీరును ఆక్షేపించాయి.