రాంచీ, ఆగస్టు 30: వేడి పెనంతో వాతలు పెట్టేది.. తీవ్రంగా చితకబాదేది.. ముఖంపై పిడిగుద్దులు గుద్దేది. ఇంటికి వెళ్తానంటే గదిలో బంధించేది.. తినడానికి అన్నం పెట్టేది కాదు.. తాగడానికి నీళ్లు ఇచ్చేది కాదు. ఆ రాక్షసి పెట్టే బాధలు తట్టుకోలేక మూత్రం పోసుకుంటే.. ఆ మూత్రాన్ని నాలుకతో శుభ్రం చేయించిందట.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉం టుందా? ఒకటి కాదు.. రెండు కాదు.. పదేండ్లుగా ఆ ఆడబిడ్డ ఎంత నరకయాతన అనుభవించిందో.. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి.
కనీసం నిలబడలేని దీనావస్థ ఆమె ది. ఇదీ సునీత అనే 29 ఏండ్ల గిరిజన మహిళ దుస్థితి.. పదేండ్లుగా తన ఇంట్లో పనులు చేసేందుకు తెచ్చి పెట్టుకుని చిత్ర హింసలు పెట్టింది ఎవరో కాదు.. జార్ఖండ్లోని బీజేపీ మహిళా నేత సీమా పాత్రా.. జార్ఖండ్ మాజీ ఐఏఎస్ మహేశ్వర్ పాత్రా భార్య. సీమా పాత్రా ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా విభాగం సభ్యురాలు. అలాగే బేటీ బచావ్, బేటీ పఢావ్ కమిటీ సభ్యురాలు కూడా. రాష్ట్రపతి కాకముందు ద్రౌపది ముర్మును కలసి శుభాకాంక్షలు తెలిపిన చాలా తక్కువ మంది బీజేపీ నేతల్లో సీమా పాత్రా ఒకరు.
సమాచారం అందడంతో..
గిరిజన మహిళ సునీత విషయం స్థానిక అధికారి వివేక్ బస్కీకి తెలిసింది. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ సిన్హాకు తెలియజేశారు. జార్ఖండ్ పోలీసుల సాయంతో ఆ ఇంటికి చేరుకుని సునీతను కాపాడారు. వెంటనే ఆమెను రాంచీలోని రిమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాపాడిన సమయంలో ఆమె ముఖం మొత్తం వాచిపోయి ఉన్నది. ఆమె నోటిపై రాడ్డుతో కొట్టడంతో పన్ను ఊడిపోయినట్టు బాధితురాలు వాపోయింది. తనతో మూత్రాన్ని నాలుకతో శుభ్రం చేయించేవారని కన్నీటి పర్యంతమైంది. ఆమె దీనావస్థ చూసి కంట నీరు పెట్టని వారు లేరు. సునీత శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్టు రిమ్స్ వైద్యులు గుర్తించారు.
పదేండ్లుగా నరకయాతన..
గుమ్లా అనే గ్రామానికి చెందిన సునీతను పదేండ్ల కింద సీమా పాత్రా, మహేశ్వర్ పాత్రా రాంచీలోని అశోక్నగర్లో ఉన్న వారి ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వారి కూతురు వత్సల పాత్రా ఇంటికి పంపారు. కొద్ది కాలం తర్వాత జార్ఖండ్కు వత్సల పాత్రా బదిలీ కావడంతో తిరిగి సీమా ఇంటికి సునీతను పంపించారు. ఎక్కడికి వెళ్లినా ఆమెను తీవ్రంగా కొట్టేవారు. ఇంటికి వెళ్తానని చెబితే చీకటి గదిలో బంధించేవారు. రాడ్లతో కొట్టేవారు.