బెంగళూర్ : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నియంత్రణలను సడలిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, యోగ సెంటర్లను పూర్తి కెపాసిటీతో ఓపెన్ చేయాలని సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించామని ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ వెల్లడించారు. భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జనవరిలో కొవిడ్-19 రోగుల హాస్పిటలైజేషన్ రేటు 5-6 శాతంగా ఉండగా ఇప్పుడది 2 శాతానికి తగ్గిందని, కొవిడ్ పరిస్ధితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కొవిడ్-19తో థియేటర్లు, సినీ పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ పరిస్ధితుల్లో శనివారం నుంచి సినిమా హాళ్లను నూరు శాతం కెపాసిటీతో అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. థియేటర్లకు వెళ్లే ప్రజలు మాస్క్లు ధరించడం సహా ఇతర మార్గదర్శకాలను విధిగా పాటించాలని కోరారు. సినిమా హాళ్లలోకి ఆహార పదార్ధాలను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.
థియేటర్లు, జిమ్లు, యోగా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్ రీఓపెన్ సందర్భంగా టీకా రెండు డోసులు తీసుకోవడం తప్పనిసరి చేశామని చెప్పారు. కరోనా నిబంధనల అమలును మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తారని, నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. థర్డ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కర్నాటక ప్రభుత్వం ఇటీవల నైట్ కర్ఫ్యూను ఎత్తివేయడంతో పాటు పబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో సీటింగ్ పరిమితులపై నియంత్రణలను తొలగించింది.