పుణె, డిసెంబర్ 2: మహారాష్ట్రలోని పుణెలో నాలుగేండ్ల బాలుడికి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ సోకింది. దీంతో ఆ బాలుడిని హుటాహుటిన సాసూన్ జనరల్ హాస్పిటల్లో చేర్చారు. ఇలాంటి కేసులు ఇంకేమైనా నమోదయ్యాయన్న అనుమానంతో వాడ్గావ్షేరీ ప్రాంతంలో వైద్య బృందాలు ఆరోగ్య సర్వే చేపట్టాయి. ఇంటింటి సర్వే చేపట్టి చిన్న పిల్లల రక్త నమూనాలు సేకరించి, పరీక్షకు పంపారు.
ఏమిటీ జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్?
దోమ కాటు వల్ల వ్యాప్తి చెందే ఈ వైరస్ మెదడువాపు వ్యాధికి కారణం అవుతుంది. దీన్ని తొలిసారిగా 1871లో జపాన్లో గుర్తించారు. 1924లో వ్యాధి వ్యాప్తి ఎక్కువై, ఏటా వేల మందిని బలి తీసుకొన్నది. తర్వాత కాలంలో భారత్ సహా పలు దేశాలకు సంక్రమించింది.