న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జిల్లా, రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలను ఇంకా భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీ అంశం తమ పరిధిలోనిది కాదని, అయినా ప్రభుత్వాలు తాత్సారం చేయడంపై మండిపడింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రప్రభుత్వాలు దయతో ఇచ్చే నిధుల కోసం హైకోర్టులు ఎదురుచూడటం బాధాకరమని అత్యున్నత ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఓ సరైన వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది.