ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన నమూనాలను ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. కేసుల పెరుగుదలకు ఏదైనా కొత్త వేరియంట్ కారణమా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సుభాష్ తెలిపారు. వైరస్ కొత్త ఉత్పరివర్తన ఉందా? లేదా? అన్న విషయం ఐసీఎంఆర్ పరిశీలనలో స్పష్టంగా తెలియలేదని, మరింత అధ్యయనం కోసం నమూనాలను ఎన్ఐవీ, ఎన్సీడీసీకి పంపినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాల నుంచి జిల్లాకు వంద చొప్పున శాంపిల్స్ సేకరించి, పంపినట్లు పేర్కొన్నారు.
ఈ అధ్యయన ఫలితాలు ఈ వారం చివరి నాటికి, లేదంటే.. పది రోజుల్లో వస్తాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ముట్యేషన్ జరిగిందా? స్వదేశీ మ్యుటేషన్ జరిగి ఉంటే.. అది ఏరకమైన ఉత్పరివర్తనమో ఖచ్చితత్వంతో చెప్పడం సాధ్యమన్నారు. విదర్భ ప్రాంతంలోని పలు జిల్లాలో కేసులు భారీగా పెరిగాయి. అమరావతి, యావత్మల్ తదితర జిల్లా కొద్ది రోజులుగా 20శాతానికి పైగా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ క్రమంలో కేసుల పెరుగుదల వెనుక ఏమైనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా? అనే కోణంలో శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్లు డాక్టర్ సుభాష్ తెలిపారు. అధ్యయనం తర్వాత కేసుల పెరుగుల వెనుక వివరాలు తెలుస్తాయన్నారు. పుణెలోని బీజే మెడికల్ కాలేజీ ప్రయోగశాలలో ఇంతకు ముందు నిర్వహించిన పరీక్షల్లో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కేసుల పెరగడానికి యూకే, ఆఫ్రికా వేరియంట్లు కారణం కాదని తేలింది.
అయితే దేశవ్యాప్తంగా పలు ప్రయోగశాలల శాస్త్రవేత్తలు సైతం కారణాలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారని, కొత్త వేరియంట్ కారణమైతే సకాలంలో నియంత్రించకపోతే ఇతర రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదర్భ ప్రాంతం నుంచి పుణె, ముంబై తదితర జిల్లాలకు వ్యాపిస్తోందన్నారు. అయితే, రోగులకు సరైన చికిత్స అందుబాటులో ఉందని, ప్రస్తుత చికిత్స వ్యూహం బాగా పని చేస్తుందని తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా వైద్యులు లక్షలాది మంది రైతులకు చికిత్స అందించారని కొనియాడారు.