న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశంలో థర్డ్వేవ్ మొదలైందా? కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతుండటం.. శుక్రవారం ఒక్క రోజునే ఏకంగా 122 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తున్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ పరిశోధకులు తాజాగా వెల్లడించిన అధ్యయనం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నది. డిసెంబర్ 15 నుంచి దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇది థర్డ్వేవ్కు సూచనగా పరిగణించవచ్చని ఐఐటీ- కాన్పూర్ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న థర్డ్వేవ్ పీక్ స్టేజీ (గరిష్ట స్థాయి)కి చేరుకొంటుందని అంచనా వేశారు. ఈ మేరకు నమూనా అధ్యయనంలో వెల్లడించారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాలో ఇదివరకే ప్రారంభమైన థర్డ్వేవ్ డాటా, కేసుల సరళి, భారత్లో ఇప్పటికే విరుచుకుపడ్డ ఫస్ట్, సెకండ్వేవ్-కేసులు, వ్యవధి తదితర అంశాలను తీసుకొని ఈ అంచనా వేశారు. అయితే, పీక్స్టేజ్ రోజున ఎన్ని కేసులు నమోదవుతాయన్న విషయాన్ని చెప్పలేదు. అప్రమత్తంగా ఉండకుంటే పరిస్థితులు దిగజారుతాయని హెచ్చరించారు. ‘అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. అయినప్పటికీ, ఆ దేశాలను థర్డ్వేవ్ కుదిపేస్తున్నది. కాబట్టి, భారత్ సహా అన్ని దేశాలు భవిష్యత్తులో ముంచుకొచ్చే వేవ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు.
జాతీయ కమిటీ అదే చెప్పింది
కొవిడ్ నేషనల్ సూపర్మోడల్ కమిటీ కూడా వచ్చే ఏడాది మొదట్లో థర్డ్వేవ్ పీక్స్టేజ్కి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే, దీని ప్రభావం సెకండ్వేవ్ కంటే తక్కువగా ఉంటుందని.. డెల్టా స్థానంలో ఒమిక్రాన్ విస్తరించడం కొనసాగితే కేసులు పెరుగుతాయని అంచనా వేసింది.
358కి చేరిన ఒమిక్రాన్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 122 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కి చేరింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,47,72,626కు చేరింది.
జాగ్రత్తలు మరువొద్దు
ప్రపంచ దేశాల్లో నాలుగోవేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం శుక్రవారం ప్రజలకు కీలక సూచనలు చేసింది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో ముఖానికి మాస్కు, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలన్నది. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. అర్హలైనవారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది. 1.5-3 రోజుల్లో ఒమిక్రాన్ కేసులు రెట్టింపవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడాన్ని ఉటంకించింది. దేశ సగటుతో పోలిస్తే కేరళ, మిజోరంలో కొవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ను నిరోధించేందుకు ప్రైవేటు వైద్య రంగం కూడా సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలు దాటిన ఒమిక్రాన్ కేసులు